.
Home » » కరీనా కపూర్‌ కంటే ఇలియానా బాగా చేసింది: 'స్నేహితుడు' శంకర్

కరీనా కపూర్‌ కంటే ఇలియానా బాగా చేసింది: 'స్నేహితుడు' శంకర్

Written By Hot nd spicy on Friday, 20 January 2012 | 08:11

అమీర్‌ఖాన్‌, మాధవన్‌, షర్మాన్‌ జోషిలతో రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వంలో విదు వినోద్‌చోప్రా బాలీవుడ్‌లో నిర్మించిన 'త్రీ ఇడియట్స్‌' చిత్రం సంచలన విజయం సాధించి ఎన్నో అవార్డ్స్‌, రివార్డ్స్‌ని కైవసం చేసుకుంది. ఇదే చిత్రాన్ని ది గ్రేట్‌ శంకర్‌ విజయ్‌, జీవా, శ్రీకాంత్‌లతో 'నన్‌బన్‌'గా తమిళంలో రూపొందించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయింది.

కాగా, ఈ చిత్రాన్ని తెలుగులో 'స్నేహితుడు' పేరుతో జెమిని ఫిలిం సర్క్యూట్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి హేరిస్‌ జయరాజ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 19న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చిత్ర ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌, ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాని, ప్రముఖ నిర్మాత విదు వినోద్‌ చోప్రా, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, షర్మాన్‌ జోషి, హీరోలు విజయ్‌, శ్రీకాంత్‌, కామెడీ కింగ్‌ సునీల్‌, ఇలియానా, సంగీత దర్శకుడు హేరిస్‌ జయరాజ్‌, ప్రముఖ నటుడు సత్యరాజ్‌, ప్రముఖ దర్శకుడు ఎస్‌.జె.సూర్య, పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, వనమాలి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, నిర్మాతల మండలి అధ్యక్షులు బూరుగపల్లి శివరామకృష్ణ, ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి, కె.సి.శేఖర్‌బాబు, ఎన్‌.వి.ప్రసాద్‌, నల్లమలుపు బుజ్జి, బి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనగా నిర్మాత జెమిని కిరణ్‌ అతిథులకు బొకేలతో స్వాగతం పలికారు.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఆడియో ఆవిష్కరణ
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 'స్నేహితుడు' ఆడియో సి.డి.ని ఆవిష్కరించి తొలి సి.డి.ని బాలీవుడ్‌ నిర్మాత విదు వినోద్‌చోప్రాకి అందించారు. జెమిని ఆడియో ద్వారా 'స్నేహితుడు' ఆడియో మార్కెట్‌లోకి విడుదలైంది. 'స్నేహితుడు' థియేటర్‌ ట్రైలర్‌ని విదు వినోద్‌ చోప్రా విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ- ''నా చిత్రాలను ఆదరిస్తూ నా మీద చూపించే అభిమానానికి తెలుగు ప్రేక్షకులందరికీ నా వందనం. ఇప్పటివరకు నేను ఏ సినిమా రీమేక్‌ చెయ్యలేదు. 'త్రీ ఇడియట్స్‌' చిత్రాన్ని ఫస్ట్‌ టైమ్‌ రీమేక్‌ చేశాను. దానికి కారణం వుంది. పూనాలో 'రోబో' షూటింగ్‌ 300 మంది జనంతో ఫైట్‌ చిత్రీకరిస్తున్నాం. టీమ్‌ అంతా షూటింగ్‌ చేయడానికి రెడీగా వున్నాం. కానీ, అక్కడ పర్మిషన్‌ దొరకలేదు. షూటింగ్‌ క్యాన్సిల్‌ అయింది.

అప్పుడు నేను చాలా టెన్షన్‌ పడ్డాను. ఆ స్ట్రెయిన్‌లో వుండి కొంచెం రిలాక్స్‌ అవ్వాలని 'త్రీ ఇడియట్స్‌' సినిమాకి వెళ్ళాను. రేపు షూటింగ్‌ ఎలా చెయ్యాలి అని నా మైండ్‌లో ఆలోచిస్తుండగా నా పక్కన వున్న వారంతా ఎంజాయ్‌ చేస్తూ క్లాప్స్‌ కొడుతున్నారు. నేను ఆ టెన్షన్‌ మూడ్‌ని పక్కన పెట్టి ఇంట్రెస్ట్‌గా మూవీ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. నా బాధలు, స్ట్రెస్‌ అంతా మర్చిపోయి మూవీ బాగా ఎంజాయ్‌ చేశాను. నా మనసుకి బాగా నచ్చిన సినిమా. అలాంటి హ్యాపీనెస్‌ మన ఆడియన్స్‌ కూడా పొందాలని ఈ సినిమా రీమేక్‌ చెయ్యడం జరిగింది.

'నన్‌బన్‌'గా తమిళ్‌లో రిలీజై మంచి హిట్‌ అయింది. ఈ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానికే చెందుతుంది. ఈ సినిమా రైట్స్‌ తీసుకొని చాలా భారీగా నిర్మించిన జెమిని ఫిలిం సర్క్యూట్‌వారిని అప్రిషియేట్‌ చేస్తున్నాను. హేరిస్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ చేశారు. సీతారామశాస్త్రిగారితో ఫస్ట్‌టైమ్‌ మంచి పాటలు రాయించుకునే భాగ్యం కలిగింది. అలాగే రామజోగయ్యశాస్త్రి, వనమాలి కూడా మంచి సాహిత్యాన్ని అందించారు. అబ్బూరి రవి స్ట్రెయిట్‌ సినిమాకి రాసినట్టుగా హార్ట్‌ టచ్చింగ్‌గా, హ్యూమరస్‌గా డైలాగ్స్‌ రాశారు. అతను రాసిన బొమ్మరిల్లు సినిమా నాకు బాగా నచ్చింది.

విజయ్‌ని 'స్నేహితుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను. జీవా, శ్రీకాంత్‌ ఇద్దరూ ఫెంటాస్టిక్‌గా నటించారు. సినిమా చూస్తుంటే నాకే ఏడుపొచ్చింది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ సింగిల్‌ టేక్‌లో చేశారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రివ్యూలో కరీనా కపూర్‌ కంటే ఇలియానా ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేసిందని రాశారు. ఈ చిత్రంలో శ్రీనివాస్‌ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ చెప్పిన సునీల్‌కి నా థ్యాంక్స్‌. నా గత చిత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి రావద్దు. జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. జనవరి 26న లక్కీ హ్యాండ్‌ దిల్‌రాజు డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా రిలీజ్‌ అవుతుంది'' అన్నారు.

హీరో విజయ్‌ మాట్లాడుతూ - ''చాలా రోజుల తర్వాత 'స్నేహితుడు'గా మీ ముందుకు వస్తున్నాను. నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. తెలుగు అన్నా, తెలుగు సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. శంకర్‌గారి దర్శకత్వంలో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత విదు వినోద్‌చోప్రా మాట్లాడుతూ - ''ఫస్ట్‌టైమ్‌ శంకర్‌గారి ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనడం ఆనందంగా వుంది. శంకర్‌, విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'స్నేహితుడు' చిత్రం సక్సెస్‌ అయి జెమిని ఫిలిం సర్క్యూట్‌ వారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాని మాట్లాడుతూ - ''ఈ ఫంక్షన్‌లో ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చాలా బాగుంది. పాటలన్నీ హిందీ కన్నా చాలా బెటర్‌గా వున్నాయి. శంకర్‌గారు ఈ చిత్రాన్ని ఫెంటాస్టిక్‌గా తీశారు. యూనిట్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌'' అన్నారు.

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట్లాడుతూ - ''జెమిని ఫిలిం సర్క్యూట్‌లో నాన్నగారు 'శంకర్‌దాదా ఎంబిబిఎస్‌', 'శంకర్‌దాదా జిందాబాద్‌'లాంటి హిట్‌ సినిమాలు చేశారు. చిన్నప్పటి నుంచి శంకర్‌గారి సినిమాలు చూసి ఈ సినిమాల్లోని పాటలకు డాన్స్‌ చేసేవాడిని. అప్పట్నించి శంకర్‌గారికి పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. ఫస్ట్‌ ఈ సినిమా చేయమని విదు వినోద్‌చోప్రాగారు నన్ను ముంబై పిలిపించి అడిగారు. నేను చాలా భయపడ్డాను. ఇలాంటి క్యారెక్టర్‌ అమీర్‌ఖాన్‌లాంటి బిగ్‌స్టార్స్‌ చేస్తేనే బాగుంటుంది. నేను చేయను అన్నాను.

'త్రీ ఇడియట్స్‌' సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తీసుకోవడానికి ఎంతో మంది ప్రొడ్యూసర్స్‌ ట్రై చేశారు. చివరికి జెమిని ఫిలిం సర్క్యూట్‌ వారికి దక్కింది. నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. శంకర్‌గారు డైరెక్టర్‌ అని తెలిసి ఈ ప్రాజెక్ట్‌లో నేను లేనే అని చాలా బాధపడ్డాను. శంకర్‌గారులాంటి గ్రేట్‌ డైరెక్టర్‌ మాత్రమే ఈ సినిమా రీమేక్‌ చెయ్యగలరు. విజయ్‌ తమిళ్‌లో బిగ్‌స్టార్‌. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వుంది. 'స్నేహితుడు' చిత్రం పెద్ద సక్సెస్‌ అయి జెమిని కిరణ్‌గారికి మంచి పేరు తీసుకురావాలి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సంగీత దర్శకుడు హేరిస్‌ జయరాజ్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకి పాటలు చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. చాలా ఫ్రెష్‌ మ్యూజిక్‌ ఇది. సాంగ్స్‌ అన్నీ బాగా వచ్చాయి. శంకర్‌గారితో ఇది నా రెండో సినిమా'' అన్నారు.

హీరో సునీల్‌ మాట్లాడుతూ - ''నా లైఫ్‌లో నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఈ 'స్నేహితుడు' చిత్రంలో శ్రీనివాస్‌ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు. ఇలియానా మాట్లాడుతూ - ''శంకర్‌గారి చిత్రంలో నటించడం చాలా ప్రౌడ్‌గా ఫీల్‌ అవుతున్నాను'' అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ - ''ఒక మంచి కథని చెప్పాల్సిన విధంగా చెప్తే తప్పకుండా చూస్తారు. అలా వరుస విజయాలు సాధిస్తున్నారు శంకర్‌. హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా 'రోబో'లాంటి హై టెక్నికల్‌ ఫిల్మ్‌ని తీసి భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చాటారు'' అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌, ఆర్‌.పి.పట్నాయక్‌ శంకర్‌ చిత్రాల్లోని పాటలు ఆలపించారు. కార్యక్రమానికి ముందు శంకర్‌ ఏవీ, విజయ్‌ ఏవీలను స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశారు. ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉదయభాను, వేణుమాధవ్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేణుమాధవ్‌ 'అపరిచితుడు', 'రోబో' గెటప్‌లతో వచ్చిన వీక్షకులను ఆనందపరిచారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger